ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ వాట్సప్ డీపీ తో మని రిక్వెస్ట్ ,మోస పోయిన డాక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఘరానా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ పేరుతో వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించిన కేటుగాళ్లు డబ్బు అవసరం ఉందని, తన అకౌంట్లో వేయాలని కోరుతూ లింకులు పంపించారు. వాట్సాప్ నంబర్‌కు కలెక్టర్ ఫోటో డీపీగా ఉన్నప్పటికీ చాలామంది అనుమానంతో ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటికొచ్చింది.

కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడ కొందరికి మొబైల్‌ నంబరు 72348 22110 నుంచి వాట్సప్‌ మెసేజ్‌లు వచ్చాయి. ‘నేను అత్యవసర సమావేశంలో ఉన్నా. ఫోన్‌ చేయలేకపోతున్నా. డబ్బులు అవసరం ఉంది. వెంటనే పంపగలరు’ అని అందులో ఉంది. డీపీ(డిస్‌ప్లే పిక్చర్‌) చూస్తే కలెక్టర్‌ ఫొటో ఉంది. కలెక్టర్ ఇలాంటి మెసేజ్ పంపించారేంటి అన్న అనుమానంతో సమావేశంలోనే ఉన్న కొందరు ఈ విషయాన్ని సిక్తా పట్నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆమె తన పేషీ ద్వారా విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

అయితే ఆ వాట్సాప్ మేసేజ్‌కి ఆదిలాబాద్‌కు చెందిన ఓ గవర్న్‌మెంట్ డాక్టర్ మోసపోయారు. కలెక్టర్‌ డీపీ ఉన్న మొబైల్‌ నంబరు నుంచి డబ్బులు పంపాలని వాట్సప్‌ మెసేజ్‌లు రాగానే ఆదిలాబాద్‌కు చెందిన ఆయన స్పందించారు. తన బావమరిదికి డబ్బులు పంపితే ఆయన రూ.10 వేల విలువైన పది అమెజాన్‌ కూపన్లు(మొత్తం రూ.లక్ష) కొని అవతలి వ్యక్తికి పంపారు. ఆ తర్వాత మరో రూ.1.5 లక్షలు కావాలని అడగడంతో అనుమానం వచ్చి ఆ డాక్టర్ కలెక్టర్‌ పేషీని సంప్రదించగా అసలు విషయం అర్థమైంది. దీంతో అప్రమత్తమైన డాక్టర్ అమెజాన్ కూపన్లను క్యాన్సిల్ చేయగా.. అవతలి వ్యక్తి మూడు కూపన్లను వాడేశాడు. మిగిలిన ఏడు కూపన్లు క్యాన్సిల్ కావడంతో డాక్టర్‌ రూ.70వేలను రాబట్టుకోగలిగారు. సైబర్ కేటుగాళ్లు ఏకంగా కలెక్టర్ పేరుతో మోసానికి పాల్పడటంతో ఆదిలాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లకు ఎవరూ స్పందించి డబ్బులు పంపించొద్దని పోలీసుల సూచిస్తున్నారు.