485 కొత్త స‌బ్ సెంట‌ర్ల నిర్మాణం

– 206 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు మ‌ర‌మ్మ‌తులు

– 43 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు కొత్త భ‌వ‌నాలు

– ఈ నెల 9వ తేదీన టెండ‌ర్లు, డిసెంబ‌ర్ లోగా నిర్మాణాలు పూర్తి

– 203 కోట్లు విడుద‌ల చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం

– జూమ్ మీటింగులో అధికారుల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశాలు

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 6 మహా వెలుగు : రాష్ట్రంలో 485 కొత్త స‌బ్ సెంట‌ర్ల నిర్మాణంతోపాటు, 206 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు మ‌ర‌మ్మ‌తులు, 43 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు కొత్త భ‌వ‌నాల నిర్మాణాలు చేప‌ట్ట‌డానికి రూ.203 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసిన‌ట్లు, వెంట‌నే ఆయా భ‌వ‌నాల నిర్మాణాలు, మ‌ర‌మ్మ‌తుల‌కు అవ‌స‌ర‌మైన టెండ‌ర్లు పూర్తి చేసి, ఈ డిసెంబ‌ర్ క‌ల్లా ఆయా ప‌నుల‌న్నీ పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశాలు, ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావు గారి సూచ‌న మేర‌కు నిర్ణీత స‌మ‌యంలో ఆయా ప‌నులు పూర్తి కావడం కోస‌మే ఈ ప‌నుల‌ను పంచాయ‌తీరాజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ శ్వేతా మ‌హంతి, ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో మంత్రి మంగ‌ళ‌వారం మంత్రుల నివాసంలోని త‌న ఇంటి నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ఒక్కో కొత్త భ‌వ‌నానికి రూ.1.5 కోట్లు, ఒక్కో స‌బ్ సెంట‌ర్ నిర్మాణానికి 20 ల‌క్ష‌ల చొప్పున కేటాయించిన‌ట్లు మంత్రి తెలిపారు. అలాగే 15వ ఆర్థిక సంఘం విడుద‌ల చేసిన నిధుల్లో మిగిలిన నిధుల‌ను ఈ విధంగా వినియోగించుకోవాల‌ని మంత్రి సూచించారు. అయితే, ఆయా ప‌నుల‌ను అనుకున్న స‌మ‌యంలో చేప‌ట్టి, పూర్తి చేయ‌గ‌లిగే కాంట్రాక్ట‌ర్ల‌కు మాత్ర‌మే అప్ప‌గించాల‌ని మంత్రి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 9వ తేదీలోగా టెండ‌ర్లు పూర్తి చేసి, వ‌చ్చే డిసెంబ‌ర్ లోగా నిర్మాణాలు పూర్తి అయ్యేట్లు చూడాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అధికారుల‌కు చెప్పారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ హ‌న్మంత‌రావు, పంచాయ‌తీరాజ్ ఇఎన్‌సి సంజీవ‌రావు, ఎస్ఇలు, డిఎం అండ్ హెచ్ ఓలు పాల్గొన్నారు.