దళిత బందు లబ్దిదారులకు క్షేత్ర పర్యటన ద్వారా డైరీ, కోళ్ల పరిశ్రమ ఏర్పాటు పై అవగాహన…..

మహా వెలుగు ప్రతినిధి ,మహబూబాబాద్, ఏప్రిల్ – 08:జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశాల మేరకు దళిత బందు లబ్దిదారులకు గురువారం క్షేత్ర పర్యటన నిర్వహించి డైరీ, కోళ్ల పరిశ్రమ ఏర్పాటు పై పూర్తి అవగాహన కల్పించామని జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఎస్.ఎల్. మనోహర్ శుక్రవారం తెలిపారు.

దళిత బంధు లబ్ధిదారులకు సంబంధిత యూనిట్ ఏర్పాటులో గల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ యూనిట్ విజయవంతంగా నడుపుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావడానికి అవసరమైతే క్షేత్ర పర్యటనలు నిర్వహించి ఇంతకుముందు విజయవంతం సాధించిన వారి యూనిట్ల వద్దకు దళిత బందు లబ్దిదారులను తీసుకెళ్లి సంబంధిత యూనిట్ పై పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక ఆదేశించారని తెలిపారు.

ఈ సందర్భంగా డోర్నకల్, ఇల్లందు, పాలకుర్తి నియోజకవర్గం దళిత బంధు లబ్దిదారులు ఎంపిక చేసుకున్న పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ యూనిట్ల ఏర్పాటుకు, పెంపకంలో మెళకువలను తెలుసుకోవడానికి, షెడ్ నిర్మాణం ఎంత పరిమాణంలో ఏర్పాటు చేయాలి, పశువుల దాణా, పోషణ, వాటికి వచ్చే వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, లబ్దిదారులకు ఉన్న ఇతర అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి బయ్యారం మండలం గంధంపల్లీ గ్రామంలో గల పాడి పరిశ్రమ, కురవి మండలం గుండ్రాతిమడుగులో గల కోళ్ల పరిశ్రమ లో అనుభవమున్న, అభివృధి లో ఉన్న యూనిట్ దారుల వద్దకు దళిత బందు లబ్దిదారులను తీసుకెళ్లి సంబంధిత యూనిట్ ల పై పూర్తి అవగాహన కల్పించామని తెలిపారు.

డోర్నకల్ నియోజకవర్గం నుండి 10 మంది, ఇల్లందు నియోజకవర్గం నుండి 6 మంది, పాలకుర్తి నియోజకవర్గం నుండి ముగ్గురు ఈ క్షేత్ర పర్యటనలో పాల్గొనగా, పాడి పరిశ్రమ లో 13 మందికి, కోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న 6 గురికి అవగాహన కల్పించామని తెలిపారు.