మహా వెలుగు, హైదరాబాద్ : తెలంగాణలో రాజ్భవన్ను, గవర్నర్ను అవమానిస్తున్నారని మీడియా సమావేశంలో తమిళిసై అన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
తమిళిసైకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దిన వేడుకలు, మేడారం జాతర, రాజ్భవన్లో ఉగాది వేడుకలు, యాదాద్రి పర్యటనలో విబేధాలు స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లడం సంచలనంగా మారింది. అంతేకాకుండా పీఎం మోదీ, హోం మంత్రి అమిత్షాలను సైతం కలిశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం నాడు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఊహించుకొని గవర్నర్ మాట్లాడితే మేం ఏం చేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెడుతున్నామని గవర్నర్ చెప్పారని తాను విన్నానన్నారు. కానీ నరసింహన్ గారు గవర్నర్ గా ఉన్న సమయంలో తమకు ఏనాడూ ఇబ్బంది రాలేదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో తమను ఇబ్బంది పెట్టినందుకు గాను ప్రస్తుతం ఆమెను మేం ఇబ్బంది పెడుతున్నామని గవర్నర్ అనడం సరైంది కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ కాక ముందు తమిళిసై ఏ పార్టీ నాయకురాలో అందరికీ తెలుసని మంత్రి అన్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించడం లేదని.. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ మంచి పనుల్ని తాను అభినందించానని, పలు సూచనలు చేశానని చెప్పారు. గురువారం తెలంగాణ గవర్నర్ ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగింది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ తో భేటీ అయిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్షా ను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాలతో అమిత్ షాతో చర్చించానని చెప్పారు. అమిత్ షాతో చర్చించిన విషయాలు బయటకు చెప్పలేనని అన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తానని తెలిపారు. తెలంగాణలో తాను రైలు, రోడ్డు మార్గంలో మాత్రమే ప్రయాణించగలను అని అన్నారు. ఎందుకో మీరే అర్థం చేసుకోండని మీడియాతో తమిళిసై అన్నారు. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతానని చెప్పారు. మేడారంకు రోడ్డు మార్గంలోనే వెళ్లానని చెప్పారు. భద్రాచలంకు కూడా రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లనున్నట్టుగా తెలిపారు.
