- ఆస్తి కాజేసేందుకు ఫేక్ వీలునామా.!
- స్టాంప్ సీరియల్ నెంబర్ల విక్రయ తేదీలతో బయటపడిన చీటింగ్.
- మహిళపై బయ్యారం పోలీసు స్టేషన్లో కేసు నమోదు
వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/బయ్యారం 23 : ఫేక్ వీలునామాను సృష్టించి వారసత్వ ఆస్తిని కాజేయాలని ఓ మహిళ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. తప్పుడు దస్తావేజేలతో ఏకంగా మొబైల్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని న్యాయస్థానాన్ని కూడ తప్పుదోవ పట్టించిన సంఘటన ఇది. ఆర్టీఐ ద్వారా అసలు విషయం బయటకు రావడంతో సదరు మహిళపై మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు.

బాధితుడు పమ్మి సతీష్కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం…పమ్మీ సుదర్శన చారి , స్వరాజ్య లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. 1.కవితాకుమారి, 2.సతీష్ కుమార్,3. మధుర వాణి. సుదర్శన చారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణం కేటీపీఎస్లో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిర పడ్డాడు. అయితే స్వగ్రామం బయ్యారం మండలంలోని సంతులాల్ పోడు తండా. సింగారం గ్రామ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 190/1అలో 0.13, 190/1/అ /1 లో 0.23 గుంటల భూమి, గంధంపల్లి రెవెన్యూ లో 27/ఇ/2 సర్వే నెంబరులో 1.10 గుంటలు మొత్తం 2.06 గుంటల భూమి ఉంది. మహబూబాబాద్ ఇల్లందు ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో భూమి విలువ ఇటీవల గణనీయంగా పెరిగింది.
భూమిని కాజేసేందుకు స్కెచ్…
పమ్మీ సతీష్కు వారసత్వంగా వచ్చిన భూమిని దక్కించుకోవాలని భావించిన ఆయన చెల్లెలు జువ్వాజి మధురవాణి, భర్త మధుతో కలిసి పథకం వేసింది.

టేకులపల్లి మండలం గ్రామానికి చెందిన వారు బూర్గంపహాడ్లోని జి.పద్మావతి స్టాంపువెండర్ బ్యాక్ డేట్లో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ రూ.50ల పేపరు తీసుకొని పాత డేటు వేయించుకొని తండ్రి పేర తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. తండ్రి స్థిరాస్తి మొత్తం తన పేరు రాసిచ్చినట్లుగా ఉన్న వీలునామా పేపర్లను తయారు చేశారు. ఈ వీలునామా ఆధారంగా వ్యవసాయ భూమిని మంగిలాల్ అనే ప్రభుత్వం ఉద్యోగికి అమ్మేందుకు బయానగా రూ.5లక్షలు కూడా తీసుకోవడం విశేషం. బయానా తీసుకున్నాకా ఈ భూమిపై వివాదం కొనసాగుతోందన్న విషయం కొనుగోలుదారుడికి తెలిసి డీల్ ఆగిపోయింది.
పమ్మి సుదర్శనా చారి 01.10.2018నాడు, తల్లి స్వరాజ్య లక్ష్మి 30.01. 2020 నాడు కాలం చేశారు.
12.01.2018న స్టాప్ వెండర్ దగ్గర రెండు రూ.50ల స్టాప్ కాగితాలు తీసుకుని 13.01. 2018 నాడు తండ్రి తన ఆస్తిని తన పేరున రాసినట్లుగా తప్పుడు డాక్యు మెంట్లు రూపొందించింది. ఆస్తి విషయంలో అన్న తనకు అడ్డుపడుతున్నాడని పేర్కొంటూ మధురవాణి 16.03.2021లో భద్రాచలం మొబైల్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కూడా పొందింది. దీంతో అనుమానం వచ్చిన పమ్మీ సతీష్ కుమార్ ఖమ్మంలోని స్టాంప్ రిజిష్టార్ కార్యాలయంలో ఆర్టీఐ ద్వారా సమాచారం కోరాడు. 29.08.2018న ఎఫ్308091, ఎఫ్308092 సీరియల్ నెంబర్ కలిగిన నాన్ జ్యుడిషియల్ రూ.50 స్టాంప్ పేపర్లు బూర్గపహాడ్ కార్యాలయానికి అందజేసినట్లు ఆర్టీఐలో తెలిపారు. అయితే మధురవాణికి దగ్గర ఉన్న పత్రాల్లో 12.01 2018న స్టాంప్ పేపర్ తీసుకున్నట్లు ఉంది. అంటే అధికారులు ఇచ్చిన వివరాలతో పొల్చినప్పుడు స్టాంప్ పేపర్లపై ఎనిమిది నెలల ముందు తేదీలు వేసి న్యాయ స్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించిందని తేలిపోయింది.
*బయ్యారంలో కేసు నమోదు* ..
ఇదే విషయంప మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు, అడిషనల్ ఎస్పి యోగేష్ గౌతమ్కు మధురవాణిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని షమ్మీ సతీష్ పిర్యాదు చేశారు. మొబైల్ కోర్టును సైతం తప్పుదోవ పట్టించిన మధురవాణిపై ఈనెల 11న చీటింగ్ సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై ఎస్ ఐ రమాదేవిని వివరణ కోరగా పమ్మి సతీష్ ఇచ్చిన పిర్యాదు మేరకు జువ్వాజి మధుర వాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
