మహా వెలుగు , హైదరాబాద్ 02 : హైదరాబాద్ అంటేనే మోసం అదే హైదరాబాద్ లో కొత్త తరహా మోసం వెలుగు లోకి వచ్చింది. నిరుద్యోగుల అవసరాలే ఆసరాగా మోసానికి తెరదీశారు నేరస్తులు. ఏకంగా ఫింగర్ ప్రింట్ సర్జరీతో ఏమార్చేస్తున్నారు. వేలి ముద్రలు కనిపించకుండా సర్జరీలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ నయా మోసానికి సంబంధించిన వివరాలను కమిషనర్ మహేష్ భగవత్ గురువారం మీడియాకు వెల్లడించారు.
కొందరు కేటుగాళ్లు గల్ఫ్ దేశాలకు వెళ్లొచ్చిన వారే టార్గెట్గా కొత్త రకం దందాకు పాల్పడుతున్నారు.ఫింగర్ ప్రింట్ ఆపరేషన్తో వేలి ముద్రలు కనిపించకుండా సర్జరీ చేసేస్తున్నారు. కేరళలో ఆరుగురికి ఈ రకమైన సర్జరీ చేశారు. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లోనూ ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ ముఠాపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. నిందితుల దగ్గర నుంచి సర్జరీ కోసం వినియోగిస్తున్న వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఏపీకి చెందిన నలుగురు ఈ కేసులో కీలక నిందితులుగా పోలీసులు వెల్లడించారు. కడప జిల్లా సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన గజ్జలకొండగారి నాగ మునేశ్వర్రెడ్డి తిరుపతిలోని చంద్రగిరిలోని కృష్ణా డయాగ్నస్టిక్స్లో రేడియాలజిస్ట్. వేలిముద్రల సర్జరీ గురించి తెలుసుకున్న మునేశ్వర్… కువైట్ నుంచి బహిష్కరణకు గురైన వారికి ఈ సర్జరీలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ ప్లాన్ను తిరుపతిలోని డీబీఆర్ ఆసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా పనిచేస్తున్న వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి గ్రామానికి చెందిన సాగబాల వెంకట్ రమణకు తెలపగా అతను అంగీకరించాడు.
మునేశ్వర్రెడ్డికి కువైట్లోని తన స్నేహితుడి ద్వారా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురైన రాజస్తాన్లోని ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వారికి మ్యూటిలెటెడ్ ఫింగర్ప్రింట్ సర్జరీ చేసేందుకు మునేశ్వర్, వెంకట రమణ రాజస్తాన్కు వెళ్లారు. ఒక్కొక్కరికీ రూ. 25 వేల చొప్పున వసూలు చేసి శస్త్రచికిత్స చేశారు.
అక్కడి పరిచయాలతో కేరళలోని మరో వ్యక్తి మునేశ్వర్ను సంప్రదించాడు. ఈ ఏడాది మేలో మునేశ్వర్, వెంకటరమణ కేరళకు వెళ్లి ఆరుగురికి ఈ సర్జరీ చేసి రూ. లక్షన్నర వసూలు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ కడప జిల్లా జ్యోతి గ్రామానికి చెందిన బోవిళ్ల శివశంకర్రెడ్డి, పాత అట్లూరి గ్రామానికి చెందిన రెండ్ల రామకృష్ణారెడ్డిలతోపాటు మరో వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. కాగా, ఫింగర్ ప్రింట్ ఒక్కో సర్జరీ కోసం 25 వేల రూపాయలు తీసుకుంటోంది ఈ ముఠా.
కువైట్ (Kuwait) ఇమ్మిగ్రేషన్ విభాగంలో ఐరిస్, ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత అందుబాటులో లేదు. కేవలం వేలిముద్రల స్కానింగ్ మాత్రమే ఉంది. దీన్ని నేరస్తులు ఆసరాగా చేసుకుంటున్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న వారు మూణ్నెళ్ల తర్వాత కువైట్కు వెళుతున్నారని మహేశ్ భగవత్ పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ఇంటి దగ్గరకే వెళ్లి ముఠా సర్జరీలు చేస్తున్నట్లు గుర్తించామని వివరించారు.
కువైట్ నుంచి బహిష్కరణకు గురైన పలువురు హైదరాబాదీలకు ఈ ముఠా సభ్యులు పరిచయమయ్యారు. దీంతో వారికి ఈ సర్జరీ చేసేందుకు కడప నుంచి ఈ ముఠా సభ్యులు గత నెల 29న అన్నోజిగూడకు చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న మల్కజ్గిరి ఎస్ఓటీ, ఘట్కేసర్ పోలీసులు.. నిందితులు బస చేసిన లాడ్జీపై ఆకస్మిక దాడులు చేసి మునేశ్వర్రెడ్డి, వెంకటరమణ, శివశంకర్, కృష్ణారెడ్డిలను అరెస్టు చేశారు.
