- కేసీఆర్ కు కృతజ్ఞతా సభలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫైర్
- ఈ పథకం ద్వారా చెన్నూర్ రైతాంగానికి శాశ్వత పరిష్కారం
–
మహా వెలుగు , చెన్నూర్ : చెన్నూర్ గడ్డకు తరతరాలు తరగని జలసిరులనిచ్చే “చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి” రూ.1658/- కోట్ల నిధులు అందించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి చెన్నూరు నియోజకవర్గ ప్రజల తరఫున నియోజకవర్గ కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ లో కృతజ్ఞత సభను ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ నిర్వహించగా ఎమ్మెల్సీ , రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరైరు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు..ఈ పథకం ఇక్కడి ప్రాంత ప్రజల చిరకాల వాంఛ ,ఈ పథకం ద్వారా చెన్నూర్ రైతాంగానికి శాశ్వత పరిష్కారం లభించినట్లే , చెన్నూరు రైతాంగం శాశ్వతంగా ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటుందని ఈ పథకం ద్వారా చెన్నూరు రైతన్నల గుండెల్లో కేసీఆర్ శాశ్వతంగా ఉండిపోతారని స్పష్టం చేశారు.
నదీ జలాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో దేశానికే మార్గనిర్దేశనం చేసిన నాయకుడు కేసీఆర్ అని ,38 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినందుకు గతంలో అన్నారం ప్రాజెక్టుపై జలజాతర నిర్వహించి ముఖ్యమంత్రి కి ఆశీస్సులు అందించిన గొప్ప మనసున్న ప్రజలు చెన్నూరు నియోజకవర్గ ప్రజలని , నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ. 1658 కోట్ల రూపాయలతో 90 వేల ఎకరాలకు సాగునీరు అందించినందుకు కృతజ్ఞత సభ పెట్టుకోవడం ఎంతో అభినందనీయమని వారు కొనియాడారు.
త్వరలో భీమారo మండల కేంద్రంలో ఉన్న గొల్ల వాగు ప్రాజెక్టు స్థిరీకరించి అదనంగా 10 వేల ఎకరాలకు వెరసి మొత్తం లక్ష ఎకరాలకు ఈ పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ఆశ బావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ద్వారా 10 టీఎంసీల గోదావరి నీటిని వాడుకోనున్నట్లు ,రెండు సంవత్సరాల కృషి, శ్రమతో చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని సాధించుకున్నామని తెలిపారు.
అనేక పర్యాయాలు సమీక్ష సమావేశాలు, సర్వేలు, చర్చలు, పర్యటన ద్వారా ఈ పథకం రూపకల్పన జరిగిందని గతంలో ఇక్కడ రైతులు ఎన్నో పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో వచ్చే నెలలో జైపూర్ మండలంలో చెన్నూరు ఎత్తిపోతల పథక పనులను, 500 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీని పనులను ప్రారంభిస్తామను వారు తెలిపారు.
అనంతరం లక్షమందితో జైపూర్ మండలం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ,చెన్నూరు నియోజకవర్గం రాష్ట్రం లోనే ఆదర్శవంతమైన నియోజక వర్గంగా మారుస్తానని ,వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
నియోజకవర్గంలో మౌలికవసతుల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించామని రైతు సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని అన్ని పథకాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని సాగునీరు, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా,రైతు పంట రుణాల మాఫీ, రైతు బంధు సమితిల ఏర్పాటు, రైతు వేదికల నిర్మాణం, ఎరువులు విత్తనాలు లభ్యత, వ్యవసాయ యాంత్రీకరణ, పాలీహౌస్ నిర్మాణం, గోదాముల నిర్మాణం, ఇలా అనేక రైతు సంక్షేమ పథకాలతో రైతు బిడ్డ కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని
నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని ,వాళ్లకి అబద్ధాల మీద ఉన్న ప్రేమ రైతులను ఆదుకోవడంలో ఉండదని ,అంబానీ, అదానిల మీద ఉన్న ప్రేమ అన్నం పెట్టే రైతులపై లేదు.రైతులను నట్టేట ముంచి పాదయాత్రల పేరుతో డ్రామాలు చేయడానికి సిగ్గు లేదా??
బండి సంజయ్ నిత్యమనుగడ కోసం చెత్తదారులు వెతుకుతున్నాడు.రైతులు ధైర్యం కోల్పోకుండా, వారి ఆర్థిక పరిస్థితి దిగజారి పోకుండా ఉండాలనే ప్రభుత్వం ధాన్యాన్ని కొంటుందని మరో సారి రైతుల పక్షాన నిలబడి ఉందన్నారు. బీజేపీ పాలనలో బాగుపడ్డ సంస్థ లేదని బాగుపడ్డ కుటుంబం లేదని ,బిజెపి నాయకుల మాటలు విని యువత పెడదారి పట్టద్దని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వాళ్లను ఎక్కడికక్కడ నిలదీయండని పిలుపునిచ్చారు.గ్రామాల్లో విస్తృత చర్చ పెట్టండి. వాస్తవాలు ప్రజలకు తెలియజేయమని తెలిపారు.
ఉచిత కరెంట్, సాగునీరు, రైతుబంధు, రైతు భీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం రైతును రాజుని చేయడానికి కృషి చేస్తుందని ,కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ పచ్చని పైరుతో కలకలలాడుతూ ఉంటే కళ్ళు మండి ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చి పన్నులు వసూలు చేయాలని కుట్ర చేస్తోన్నట్లు వారు తెలిపారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్న 15 లక్షల 66 వేల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు?తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఆంధ్ర లో 7 మండలాలు కలిపి ,బయ్యారం పరిశ్రమకు ఎగనామం పెట్టడం కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ తెరవకపోవడం నవోదయ పాఠశాలలు మంజూరు చేయకపోవడం ,IIM విస్మరించడం ,ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోవడం మన బియ్యాన్ని నూకలు అంటూ అవహేళన చేయడం ,
ఇప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించడం..
ఇలా అడుగడుగునా తెలంగాణకు కేంద్రం ద్రోహం చేస్తోందిని గత పాలకులు వీకెండ్ టూరిస్టుల్లా వచ్చి సూటు.. బూటు..సూట్కేసు రాజకీయాలు చేశారని వాళ్ళకి పైసలు మీద ఉన్న ప్రేమ ప్రాంతం మీద లేదు. ఓట్లు వేయించుకోవాలి కోట్లు సంపాదించాలి. అదే వాళ్ల సిద్ధాంతo ఆనాడు వాళ్ల కు ఉందని తెలిపారు.
టిఆర్ఎస్ అంటే మిషన్ ,కాంగ్రెస్ అంటే కమిషన్. రేవంత్ రెడ్డి ఒక మెంటల్ రెడ్డి అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ టు జెడ్ స్కాముల పార్టీలో రేవంత్ లాంటి A1, A2 లే ఉంటారని ,మాది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉన్నంతకాలం కెసిఆర్ నాయకత్వంలో రైతులకు ఎలాంటి నష్టం జరగబోనివ్వమని అన్నారు.
ఈ సభలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ , గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ , ఎంపీపీ మంత్రి బాబు, జెడ్ పి టి సి మోతే తిరుపతి మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రాం లాల్ గిల్డ , మంచిర్యాల జిల్లా రైతుబంధు అధ్యక్షుడు బిక్షపతి , కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
