వారిని తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ ఉద్యోగిని

మహా వెలుగు సూర్యాపేట: ఆసుపత్రిలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది దురుసు ప్రవర్తన ఆ వైద్యురాలికి ఆవేదన కలిగించింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలత చెంది ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా వైద్యాధికారికి అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో వైద్యాధికారిగా పనిచేస్తున్న ఉషారాణి పట్ల అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌(సీవో) ఉపేందర్‌ దురుసుగా ప్రవర్తించాడు. విధులకు సక్రమంగా రానందుకు సీవోను తాను మందలించానని, అందుకు సీఓ తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని వైద్యురాలు ఉషారాణి అధికారులకు ఫిర్యాదు చేశారు.

తాను ఫిర్యాదు చేసే సమయంలో డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌ విచారణ చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో సీసీ.. అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు వచ్చి కలెక్టర్‌కు ఎందుకు ఫిర్యాదు చేశావు అంటూ ప్రశ్నిస్తూ తనకు సంబంధం లేని విషయాలపై వేధింపులకు గురిచేశాడని సదరు వైద్యురాలు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశానని, విచారణ చేస్తామని చెబుతూ దాటవేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చే విలువ మెడికల్‌ ఆఫీసర్‌కు ఇవ్వడం లేదని కలత చెందిన వైద్యురాలు ఉషారాణి తన విధులకు రాజీనామా చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటాచలంకు రాజీనామా పత్రాన్ని అందజేశారు.