మహా వెలుగు రామగుండము 28: సింగరేణి లో కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెలో భాగంగా కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, జాతీయ
కార్మిక సంఘాలతో పాటు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, విప్లవ కార్మిక సంఘాలు ఇచ్చిన రెండు రోజుల సార్వత్రిక సమ్మె లో భాగంగా మొదటి రోజు సింగరేణిలో సమ్మె విజయవంతం అయ్యింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనుంది.
పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ఆరు బొగ్గుగనులు, నాలుగు ఓపెన్ కాస్ట్ లో కార్మికులు మొదటి షిఫ్ట్ లో స్వచ్చందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో నిత్యం కార్మికులతో కళకళలాడే బొగ్గుగనులు సమ్మె ప్రభావంతో బోసిపోయాయి. సమ్మెను విజయవంతం చేయాలని, కార్మిక సంఘాలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని, సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాక్ లను వేలం వేయడానికి పూనుకుందని నాయకులు ఆరోపించారు. కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
