చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అమ్మనాన్నలు అడిగింది ఇవ్వలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువకులు సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని కొందరు, అడిగిన డబ్బు ఇవ్వలేదని మరికొందరు ఇలా చిన్నచిన్న కారణాలకే సూసైడ్ లు చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
కారు కోసం తల్లిదండ్రులపై యువకుడి ఒత్తిడి
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు 22 సంవత్సరాల భాను ప్రకాష్ గౌడ్ గత కొంత కాలంగా కారు కొని ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడుగుతున్నాడు. అయితే కుటుంబ సభ్యులు అతని కోరికను వాయిదాలు పెడుతూ వస్తున్నారు. ఇక 15 రోజులుగా భాను ప్రకాష్ గౌడ్ కుటుంబ సభ్యులపై పెడుతున్న ఒత్తిడి మరింత పెరిగింది.
యాసిడ్ తాగిన యువకుడు మృతి
తాను అడిగినా ఎవరు పట్టించుకోవడం లేదని ఇంట్లో వారిపై ఒత్తిడి చేస్తున్న భాను ప్రకాష్ గౌడ్ శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారులో యాసిడ్ తాగాడు. ఆ తర్వాత కడుపులో మంటలకు తాళలేక అరుస్తూ రోడ్డు మీదికి వచ్చాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే భాను ప్రకాష్ ను అతని ఇంటికి తీసుకు వెళ్లారు. కుటుంబ సభ్యులు అతడ్ని ఆస్పత్రికి తరలించగా భాను ప్రకాష్ ఆసుపత్రిలో మృతి చెందాడు.
