జిల్లాకు ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డ్ రావడం గర్వకారణం ….

వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ ,మహబూబాబాద్, ఏప్రిల్ – 23: జిల్లాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డ్ రావడం గర్వకారణమని, విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుందని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.

జిల్లాకు ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డ్ రావడంతో ఆర్డీవో కొమురయ్య, మార్కెట్ కమిటీ సిబ్బంది, జిల్లా అధికారులు శనివారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక ను కలిసి అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఈ-నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ – నామ్) ద్వారా విజయవంతమైన సేవలు అందిస్తున్నందుకు 2019 సంవత్సరానికి గాను జిల్లాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రధానమంత్రి ఎక్సలెన్సి అవార్డ్ దక్కడం గర్వకారణమని, ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.

ఇటువంటి అవార్డులు మరిన్ని అందుకునే విధంగా కష్టించి పనిచేసే మనస్తత్వం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా మార్కెటింగ్ సిబ్బందిని, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం వెంకట్ రెడ్డి ని, మార్కెట్ కార్యదర్శి ఎన్. రాజా, సూపర్వైజర్ జి. రాజేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, డి.హెచ్.ఎస్. ఓ. సూర్యనారాయణ ను జిల్లా కలెక్టర్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కొమురయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.