సీఐ కి క్షమాపణ చెప్పిన ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి.. ఏమన్నారంటే..?

మహా వెలుగు , వికారాబాద్ : ముఖ్యంగా సోషల్ మీడియా లో రచ్చ రచ్చ అయిన అధికార పార్టీ నేత ఎమ్మెల్సీ మహేందర్​ రెడ్డి ఆడియో టేపులు మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగడంతో మహేందర్​ రెడ్డి దిగివచ్చారు.

వికారాబాద్ జిల్లాలో మాత్రం అధికార పార్టీ నేత ఆడియో టేపులు సోషల్ మీడియా తో పాటు అన్నీ మీడియాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. టీఆర్​ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కి సంబంధించిన బూతుపురాణమే ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు అధికార పార్టీకి చెందిన నేత బండ బూతులు తిట్టింది, ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చింది ఎవరికో కాదు..స్వయానా పోలీస్ డిపార్ట్‌మెంట్‌ కి చెందిన ఓ సీఐకి కావడంతో వివాదం మరింత రచ్చకు దారి తీసింది. అయితే దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగడంతో మహేందర్​ రెడ్డి దిగివచ్చారు. అటు సోషల్ మీడియా తో పాటు మీడియా లు వెబ్ మీడియాలు ,యూట్యూబ్ ఛానెల్స్ టిఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి ఒక్క ఆట ఆడుకున్నాయి. దీనితో మహేందర్ రెడ్డి దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిన్నటి సంఘటన పోలీసుల మనుసు నొప్పిస్తే అది తనకు బాధాకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో ‘‘ పోలీసు సోదరులంతా నా కుటుంబ సభ్యులతో సమానం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రత లో వారి కృషి అభినందనీయం” అన్నారు. పొరపాటున నోరుజారిన, కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవం అని చెప్పారు.

అధికారుల్ని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు..

అసలు జరిగింది ఏంటి ? అంటే వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లో అధికార పార్టీకి చెందిన నేతల మధ్య ఆధిపత్యపోరు, వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈక్రమంలో నేతలు డైరెక్ట్‌గా రంగంలోకి దిగకుండా మధ్యలో అధికారుల్ని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా, తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డి పై బూతు పురాణం అందుకున్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.

తాండూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా రథోత్సవం రోజున ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయమై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి రౌడీషీటర్లకు కార్పెట్లు వేస్తావా ? అంటూ నోటికొచ్చినట్లుగా ఫోన్‌లో బూతులు తిట్టారు. ప్రజాప్రతినిధులు ఉపయోగించకూడని భాషతో నీ అంతు చూస్తా..! అని వార్నింగ్‌ ఇచ్చారు.

మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఫోన్‌ కాల్‌ చేసి తిడుతుంటే సీఎం రాజేందర్‌రెడ్డి పద్ధతిగా మాట్లాడాలని ఎమ్మెల్సీకి సూచించారు. అందుకు కూడా ఆయన మరింత రెచ్చిపోయారు. రికార్డు చేసుకో.. మీడియాకు ఇచ్చుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే రౌడీషీటరా? అని సీఐ ప్రశ్నించగా.. వాడి పక్కన రౌడీషీటర్లు లేరారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఇసుక దందాలో నీ ప్రమేయం లేదా? ఇప్పటినుంచి నీ అంతు చూస్తా అంటూ ఫోన్‌లో సీఐ రాజేందర్ రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతులు మాట్లాడుతూ…. రెచ్చిపోయారు.. ఇప్పుడా ఆ ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన పై కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే వికారాబాద్ లో వర్గ పోరు ఎక్కువ కావడం తో పాటు ఇల్లిగల్ నేతలు చేసే పనులు , టెండర్లు ,తమ అనుచురలకు దక్కగా పోవడం తోనే ఇవన్నీ తెరపైకి వస్తుంది అని సమాచారం