ఇంట్లో మ‌రుగుదొడ్డి లేదని మహిళ మృతి

ఇంట్లో మ‌రుగుదొడ్డి లేక‌పోవ‌డంతో ప్ర‌తిసారి బ‌య‌టికి వెళ్లాల్సి వ‌స్తుంద‌ని ఒక మ‌హిళ మ‌న‌స్తాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకుంది. తమిళనాడులోని కడలూరులో తన భర్త ఇంట్లో టాయిలెట్ లేకపోవడంతో మనస్తాపానికి గురైన 27 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. కడలూరు జిల్లా అరిసిపెరియంకుప్పం గ్రామానికి చెందిన రమ్య, ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఏప్రిల్ 6న కార్తికేయతో వివాహం జరిగింది. వివాహమైన తరువాత రమ్య తన భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా టాయిలెట్ ఉన్న ఇంటికి మారిపోదామని ఆమె భర్తను పదేపదే కోరింది. ఇది వారి మధ్య గొడవకు దారితీసింది. అది చినికి చినికి గాలి వాన కావడంతో రమ్య మనస్థాపం చెందింది.

దాంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. తల్లితో కలిసి జీవించడం ప్రారంభించింది. సోమవారం రమ్య.. ఇంట్లోపి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన తల్లి.. కూతురుని హుటా హుటిన కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అనంతరం రమ్యను పాండిచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్)కు తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. రమ్య తల్లి మంజుల తిరుపతిరుపులియూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.