పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ను సీఎం కేసీఆర్.. సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. భారత దేశమే ఆశ్యర్చపడే విధంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నాము. తెలంగాణ ప్రగతిపై వివిధ రాష్ట్రాలు దృష్టిపెట్టాయి. 26 రాష్ట్రాల రైతు నాయకులు తెలంగాణ సాగు విధానంపై ఆరా తీశారు. రైతు నాయకులు నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. నిన్న కూడా నన్ను రైతులు కలిశారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతోంది. బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తున్నాయి. ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో దోపిడీ తప్ప మరేమీ లేదు. ఇక్కడ ఉండే నాయకులతో చెప్పులు మోయించుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే దోపిడీ దొంగలు.. వాళ్ల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడున్నారు. ఆత్మగౌరవంతో ఉందామా.. గులాంలుగా మారుదామా?.
గుజరాత్ మోడల్ పేరుతో దేశాన్ని నాశనం చేశారు. నరేంద్ర మోదీ తీరు కారణంగా.. శ్రీలంకలో కూడా దేశ ప్రతిష్ట దెబ్బతింది. ప్రధాని మోదీ గో బ్యాక్ అంటూ లంకేయులు నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రాదు. రైతులకు మీటర్ పెట్టాలంటున్న మోదీకే మీటర్ పెడుదామం. బీజేపీ ముక్త్ భారత్ అంతా కలిసి రావాలి. బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతోంది అని తెలిపారు.
