

మహా వెలుగు న్యూస్ నిజామాబాద్ 05: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్(నిజామాబాదు ) బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారు. 2024లో దేశంలో బీజేపీయేతర ప్రభుత్వం రాబోతోందని.. అప్పుడు దేశంలోని రైతులందరికీ 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ(బీజేపీ ) ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.ఎవరైతే వ్యవసాయానికి కరెంటు మీటర్లు పెట్టమని అంటున్నారో.. మనందరం ఏకమైన వారికే మీటర్ పెట్టాలని కేసీఆర్(సీఎం కెసిఆర్ ) అన్నారు. అలా జరిగితేనే దేశం బాగుపడుతుందని అన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి వరం భారతదేశానికి ఉందన్న కేసీార్.. దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి ఉందని.. అందులో 41 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి అనుకూల భూములు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
దేశంలో అనేక నదులు ఉన్నాయని.. కానీ ఒక్కటి పెద్ద రిజర్వాయర్ లేదని అన్నారు. దేశంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కట్టలేదని… కొత్త ఫ్యాక్టరీ పెట్టలేదని ఆరోపించారు. ఉన్న కంపెనీలను కూడా అమ్ముకోవడంపైనే కేంద్రం దృష్టి పెట్టిందని విమర్శించారు. రైతు సంఘాలు, రైతు బిడ్డలు సమావేశాలు పెట్టి రైతు వ్యతిరేక విధానం అవలంభిస్తున్న పార్టీలను తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు.
దేశంలోని విమానాలు, ఓడరేవులు, రైళ్లు, బ్యాంకులు అమ్మారని.. ఇక మిగిలింది రైతుల దగ్గర ఉన్న భూమి మాత్రమే అని కేసీఆర్ అన్నారు. ఎరువుల ధరలు పెంచుతున్నట్టుగా పంట ధరలు పెంచడం లేదని ఆరోపించారు. దీని వెనుక చాలా బలమైన కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు. రైతుల వద్దనున్న భూములు లాక్కోని తన స్నేహితులు, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. వాళ్లకు భూములు ఇచ్చి.. అందులోనే కూలీ పని చేయమని చెబుతారని అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన కుట్ర అని కేసీఆర్ మండిపడ్డారు. ఎన్ఏపీల కింద పెద్ద పెద్ద గద్దలకు దేశ సంపదను దోచిపెట్టిన ప్రధాని మోదీ .. రైతుల కోసం కేవలం లక్షన్నర కోట్లు ఖర్చయ్యే కరెంట్ ఇవ్వలేరా ? అని ప్రశ్నించారు.
